Thursday, October 27, 2011

Karthikapuranam

లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట
పూర్వ కాలమున ద్రావిడ దేశమున౦దొక గ్రామమున నొక
స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు, అక్కడనే భుజించుచు, ఒకవేళ వారి సంతోషము కొలది  మైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విదముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టు కొనుచు, దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులకు తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు- సొమ్ము కుడబెట్టుకొనుచుండెను. ఈ విదముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసి పనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించు చుండెను. ఎంత సంపాదించిననేమి? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని, దేవుని మనసార ధ్యాని౦చుట గాని చేసి యెరుగుదురు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్ధయాత్రలకు వెళ్ళే  వారిని జూచి అవహేళన చేసి, యే ఒక్క భిక్షగానికిని  పిడికెడు బియ్యము పెట్టక తను తినక ధనము కూడాబెట్టుచు౦డెడిది.

అటుల కొంత కాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు
శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గ మధ్యమున ఈ స్త్రీ యున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో మజిలి చేసెను. అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని  అమెకడకు వెళ్లి' అమ్మా! నా హితవచనము లాలకి౦పుము. నీకు కోపము వచ్చిన సరే నేను చెప్పుచున్న  మాటలను అలకి౦పుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో యెవరూ చెప్పలేరు. పంచ భూతములు, సప్త ధాతువులతో నిర్మించ బడిన శరీరములోని ప్రాణము- జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి  అసహ్యముగా  తయారగును. అటువంటి యి శరీరాన్ని  నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన . తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని  చూచి మిడత దానిని తిందామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మ మగుచున్నది. అటులనే మానవుడు కూడా తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించు చున్నాడు. కాన, నా మాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పు డైన పేదలకు దానధర్మములు చేసి, పుణ్యమును సంపాదించు కొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాపరిహరర్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాత: కాలమున నది స్నాన మాచరించి, దాన ధర్మముల జేసి, బ్రాహ్మణులకు బోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొంద గల'వనివుపదేశమిచ్చేను.

ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయు
రాలై  మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచు కార్తీక మాస వ్రత మాచరించుటచే జన్మ రాహిత్యమై మోక్షము కావున కార్తీక మా సవ్రతములో అంత మత్యమున్నది.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త  కార్తీక మహాత్య మందలి
అరవ అధ్యాయము - ఆరవ రోజు పారాయణము సమాప్తము.

0 comments:

Post a Comment